తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. దానికి అనుకూలంగానే ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటుంది. ఇటీవల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ బాగా బలపడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం.. దీనికి తగ్గట్లుగానే పార్టీలోను పెద్ద ఎత్తున చేరికలు నమోదు అవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి ఉండడంతో పై చేయి సాధించేందుకు కాంగ్రెస్ రకరాల వ్యూహాలకు తెరతీస్తుంది. ఎన్నికల ప్రచారానికి కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో మరింతగా ప్రజలను ఆకట్టుకునే విధంగా అనేక అస్త్రాలను బయటకు తీస్తోంది.
Advertisement
అందులో భాగంగానే నియోజకవర్గాల్లో స్థానికంగా నెలకొన్న సమస్యలను హైలైట్ చేసి ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. స్థానిక సమస్యలను ఎక్కువగా ప్రస్తావించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు అని లెక్కల్లో ఉంది. ప్రజలు కూడా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ గుర్తించిందని భావిస్తారని, ఇది తనకి కలిసి వస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుంది. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా స్థానిక సమస్యలను హైలెట్ చేయాలని ఏఐసీసీ, పీసీసీ అబ్జర్వర్లు అందరికీ వ్యూహకర్తలు సూచించారట. స్థానిక సమస్యలను ప్రస్తావించే సమయంలో ఆ సమస్యలు ఎదుర్కొంటున్న వారితోనే వీడియో మాట్లాడించారని కూడా కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తలు చెప్పారట.
Advertisement
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి సమస్యలను ప్రస్తావిస్తే అది ఆరోపణగా మాత్రమే ఉంటుందని, అదే నేరుగా ప్రజల సమస్యలను చెప్పుకుంటున్నట్లుగా ఉంటే.. జనాల్లోకి బాగా వెళుతుందని మిగతా ప్రాంతాల పైన ఆ ప్రభావం కనిపిస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటుందట. అందుకే ఈ చివరి వారంలో లోకల్ సమస్యలను హైలెట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకోవడంతో, అభ్యర్థులు ఇప్పటికే ఈ తరహా ప్రచారాన్ని మొదలుపెట్టారట. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో ప్రతీ ఒక్కరిని పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని.. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో తటస్తులు, ఆయా ప్రాంతాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వారిని వెంట తీసుకువెళ్తే మరింతగా కలిసి వస్తుందనే విషయాన్ని కాంగ్రెస్ వ్యూహకర్తలు చెప్పడంతో ఇప్పుడు అభ్యర్థులు అదే వ్యూహాన్ని అమలు చేసే పనుల్లో నిమగ్నం అయ్యారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!