Home » IND Vs ENG : టీమిండియాకు షాక్.. హైదరాబాద్ లో భారత్ తొలి ఓటమి..!

IND Vs ENG : టీమిండియాకు షాక్.. హైదరాబాద్ లో భారత్ తొలి ఓటమి..!

by Anji
Published: Last Updated on

హైద‌రాబాద్‌లో టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ 28 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగులు చేయ‌గా భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 436 ప‌రుగులు చేసింది. భార‌త్ కు మొద‌టి ఇన్నింగ్స్‌లో 190 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. అయితే ఓలీ పోప్ (196) భారీ శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ ముందు 231 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

231 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (39), య‌శ‌స్వి జైస్వాల్ (15)లు తొలి వికెట్‌కు 42 ప‌రుగులు జోడించి శుభారంభం అందించారు. య‌శ‌స్వి జైస్వాల్ ఔట్ కాగానే వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన శుభ్‌మ‌న్ గిల్ రెండు బంతులు ఎదుర్కొని డ‌కౌట్ అయ్యాడు. దీంతో భార‌త్ 42 ప‌రుగుల వ‌ద్దే రెండో వికెట్‌ను కోల్పోయింది.  మ‌రోవైపు ధాటిగా ఆడిన కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ(39) జ‌ట్టు స్కోరు 63 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ ద‌శ‌లో కేఎల్ రాహుల్‌(22), అక్ష‌ర్ ప‌టేల్ (17) కాసేపు వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నారు. నాలుగో వికెట్‌కు 32 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పిన త‌రువాత అక్ష‌ర్ ప‌టేల్ ఔట్ అయ్యాడు. ఈ నాలుగు వికెట్లు కూడా టామ్ హార్ట్లీ నే ప‌డ‌గొట్టాడు.

ఈ ద‌శ‌లో ఇంగ్లాండ్ బౌల‌ర్లు విజృంభించారు. దీంతో భార‌త్ 117 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, కేఎస్ భ‌ర‌త్ (28) లు కాసేపు వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నారు. వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు 57 ప‌రుగులు జోడించారు. మ‌రికాసేప‌ట్లో నాలుగో రోజు ముగుస్తుంద‌న‌గా భ‌ర‌త్ ఔట్ అయ్యాడు. ఆ త‌రువాత భార‌త ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు ప‌ట్ట‌లేదు. ఆఖ‌రుకు 202 ప‌రుగుల‌కు భార‌త్ కుప్ప‌కూలింది. దీంతో 28 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది.

Visitors Are Also Reading