Home » క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో కేటీఆర్ ట్వీట్ సంచ‌ల‌నం..!

క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో కేటీఆర్ ట్వీట్ సంచ‌ల‌నం..!

by AJAY
Ad

బెంగళూర్‌ను వదిలి ఐటీ ఇండస్ట్రీలు హైదరాబాద్‌కు తరలిరావాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. కేటీఆర్‌ ట్వీట్‌పై కర్ణాటక బీజేపీ నేతలు మండిపడుతుంటే విపక్ష నేతలు మాత్రం ఆ ట్వీట్‌లో తప్పులేదంటున్నారు. హిజాబ్‌ , హలాల్‌ వివాదాల కారణంగా ఐటీ ఇండస్ట్రీలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే ప్రమాదం వచ్చిందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా ఈ వ్యవహారంపై తాజాగా మంత్రి కేటీఆర్‌, క‌ర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ మ‌ధ్య ట్విట్టర్‌ వేదిక‌గా ఆస‌క్తికర చ‌ర్చ జ‌రిగింది. బెంగుళూరులో మౌలిక స‌దుపాయాలు స‌రిగా లేవ‌ని కొన్ని రోజుల క్రితం ఖాతాబుక్ సీఈవో రవీశ్‌ నరేష్‌ త‌న ట్వి్ట్టర్‌ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు. దానికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ .. అన్నీ సర్దుకొని మీరంతా హైద‌రాబాద్‌కు రావొచ్చు.. ఇక్కడ ఉత్తమ స‌దుపాయాలున్నట్లు ట్వీట్ చేశారు. ఇన్నోవేష‌న్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్ గ్రోత్‌పై త‌మ ప్రభుత్వం దృష్టి పెట్టిన‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. తాజాగా ఈ ట్వీట్‌పై క‌ర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ స్పందించారు. ‘కేటీఆర్‌ మీ ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తున్నాం.. 2023లో క‌ర్ణాట‌క‌లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంది. మ‌ళ్లీ బెంగుళూరు నగరానికి పూర్వ ఐటీ వైభవాన్ని తీసుకొస్తాం’ అని రాసుకొచ్చారు శివకుమార్‌.

Advertisement

డీకే ట్వీట్‌పై మళ్లీ స్పందించారు కేటీఆర్‌ ‘శివ‌కుమార్ అన్నా.. కర్ణాట‌క రాజ‌కీయాల గురించి నాకు అంత‌గా తెలియ‌దు. అక్కడ ఎవ‌రు గెలుస్తారో చెప్పలేను. కానీ మీరు విసిరిన స‌వాల్‌ను స్వీక‌రిస్తున్నాను. దేశ యువ‌త, సౌభాగ్యం కోసం ఉద్యోగాల క‌ల్పనకు సంబంధించి హైద‌రాబాద్‌, బెంగుళూరు న‌గ‌రాల మ‌ధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాల‌ని కోరుకుంటున్నాను. మౌలిక క స‌దుపాయాల క‌ల్పన, ఐటీ, బీటీల‌పై ఫోక‌స్ పెడుదాం. కానీ హ‌లాల్‌, హిజాబ్ లాంటి అంశాల‌పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం లేదు’ అని రాసుకొచ్చారు కేటీఆర్‌.

Advertisement

కర్ణాటక ఐటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ మాత్రం కేటీఆర్‌ ట్వీట్‌ను తప్పుపట్టారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి పోటీ అవసరం లేదన్నారు. రాష్ట్రాల మధ్య పోటీ కాదు.. ప్రపంచంతో మనం పోటీ పడాలన్నారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ బీజేపీ అధికారం లోకి వస్తుందని, ఇరు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తుందని కర్ణాటక బీజేపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే కేటీఆర్‌ చేసిన ట్వీట్‌లో తప్పులేదని మళ్లీ బీజేపీ నేతలకు కౌంటర్‌ ఇచ్చారు డీకే శివకుమార్‌. తన రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడంలో కేటీఆర్‌ తప్పులేదన్నారు. కాగా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల కోసం హిజాబ్‌ , హలాల్‌ వివాదాలను తీసుకొచ్చిందని మాజీ సీఎం కుమారస్వామి గౌడ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోయే ప్రమాదముందన్నారు. కేటీఆర్‌ తన రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించడంలో తప్పులేదన్నారు.

Visitors Are Also Reading