పారసిటమల్ ఈ టాబ్లెట్ గురించి తెలియని వాళ్లు ఉండరు. జ్వరం వచ్చిందంటే ముందుగా డాక్టర్ లు ఇదే టాబ్లెట్ ను ఇస్తుంటారు. ఇక కరోనా విజృంభణ తరవాత ప్రతి ఇంట్లో కూడా పారసిటమల్ టాబ్లెట్ల షీట్లు ఉంటున్నాయి. అయితే పారసిటమల్ టాబ్లెట్ లను మనం జ్వరం తగ్గడానికి వాడితే అమెరికా మాత్రం పాములను చంపేందుకు ఈ టాబ్లెట్ లను వాడుతోంది. అమెరికాకు చెందిన గువాం అనే దీవిలో బ్రౌన్ ట్రీస్ స్నేక్ అనే జాతి పాములను చంపేందుకు అమెరికా పారసిటమల్ ను వినియోగిస్తోంది.
Advertisement
చనిపోయిన ఎలకలకు ముందుగా పారసిటమల్ మందును ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. వాటిని హెలికాప్టర్ ల ద్వారా దీవిలో పడేస్తున్నారు. ఇక ఆ పారసిటమల్ ఇంజెక్ట్ చేసిన ఎలకలను తిన్న పాములు చనిపోతున్నాయి. పాములు చనిపోతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు కూడా అమెరికా కొన్ని ఎలకలకు ట్రాకర్స్ ను అమరుస్తోంది. ఇక పాములను చంపేందుకు అమెరికా ఏకంగా ఏడాదికి అరవై కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది.
Advertisement
పాములను అమెరికా చంపడానికి కూడా ఓ కారణం ఉంది. ఈ పాములు ఎన్నో జీవజాతులను అంతం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ పాముల వల్ల కొన్ని రకాల పక్షులు కూడా అంతరించిపోయాయి. విద్యుత్ స్థంభాల వైర్లలో ఈ పాములు చిక్కుకోవడం వల్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుంది.
హైదరాబాద్ కంటే చిన్నగా ఉండే గువాం దీవిలో ఏకంగా 30లక్షల వరకూ ఈ పాములు ఉన్నాయి. దాంతో అమెరికా ఈ పాములతో యుద్దమే చేయాల్సి వస్తుంది. ఇక పాములను చంపడం నేరం అంటూ పెటా వంటి సంస్థలు కన్నెర్ర చేస్తున్నాయి. కానీ పాముల వల్ల వచ్చిన ఇబ్బందుల వల్లే అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.