మర్యాద అంటే.. గోదావరోళ్లు.. గోదావరోళ్లంటే మర్యాద అనేంతగా ఉంటుంది. వారు మాట్లాడే విధానం.. చూసిన అతిథి వరకు అన్నింటిలో కూడా వారి మర్యాద ఉట్టిపడుతుంది. ముఖ్యంగా మాటకు ముందు గారు, మాట తరువాత గారు అంటూ మర్యాదకు మారుపేరుగా నిలుస్తుంటారు. ఇక అల్లుళ్లకు గోదావరోళ్లు ఇచ్చే రెస్పెక్ట్ ఓ రేంజ్లో ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇక ఈ మర్యాద పీక్స్ లెవల్కు వెళ్తుంది. ఇంటికొచ్చిన కొత్త అల్లుడిని రకరకాల భోజనాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. తాజాగా నర్సాపురంలో మనవరాలికి, ఆమె ఫియాన్సికి ఓ తాతయ్య ఇచ్చిన విందు భోజనం నెట్టింట ప్రస్తుతం వైరలవుతోంది.
Advertisement
Advertisement
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన ఓ వ్యక్తి తన మనవరాలికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కాబోయే అల్లుడిని సంక్రాంతి భోజనానికి ఆహ్వానించాడు. సదరు తాతయ్య ఏకంగా 365 వంటకాలతో గోదారోళ్ల మర్యాద ఏవిధంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించారు. డైనింగ్ టేబుల్ మొత్తం ఏమాత్రం కొంచెం కూడా ఖాళీ లేకుండానే అన్ని వంటకాలతో నిండిపోయింది. వీటిలో అన్నం, పులిహోర, బిర్యానీలు, దద్దోజనం, వంటి వంటకాలతో పాటు 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్లు, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్క్రీమ్లు, 35 రకాల డ్రింక్లు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులతో విందు ఏర్పాటు చేసారు.
నరసాపురంకు చెందిన అచంట గోవింద్ నాగమణి దంపతులు తమ కూతురు అత్యం మాధవి, వెంకటేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె కుందవికి తణుకుకు చెందిన తుమ్మలపల్లి సాయికృష్ణతో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఈ తరుణంలోనే కాబోయే నూతన వదూవరులకు, వదువు తాతయ్య విందు ఏర్పాటు చేసి గోదారోళ్ల మర్యాదను రుచి చూపించారు. ఇక ఇంకేముంది.. ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. కొందరూ అయితే ఏకంగా గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మర్యాద బాగుంటుందని కూడా ఆశ పడుతూ ఉన్నారు.