పులస ఈ పేరు వినగానే ఆహా.. ఏమి రుచి అంటాం ఈ చేప ఎంత ప్రత్యేకమో దాని మనుగడ సమరంలో అంతకు మించిన ప్రత్యేకతలున్నాయి. మనలో చాలా మందికి దాని పుట్టుక పునరుత్పత్తి మనుగడ కోసం సాగించే పోరాటం గురించి తెలియదు. పులస వలస గురించి అంతకన్నా తెలియదు. ఖండాంతరాలు దాటి మన గోదారమ్మ ఒడికి చేరి పునరుత్పత్తి తరువాత తిరిగి వెళ్లే అరుదైన అంశం ఎప్పటికీ ఆశ్చర్యకరమే. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సముద్రజలాల్లో ఉండే పులసకు మన గోదారికి ఏంటి సంబంధం ఎక్కడిది ఈ బంధం అని ఆశ్చర్యపోతాం. దాదాపు 11వేల నాటికల్ మైళ్ల దూరంలో ఉండే పులసల జన్మస్థానం గోదావరి నదినే. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పులస చేపలు పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ దేశాల సముద్ర జలాల్లో జీవిస్తుంటాయి. ఇది క్యుఫిడే కుటుంబానికి చెందిన కార్డేటాగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. పులజ ప్రజాతి హిల్సా. జాతి ఇల్సా. ఈ ఇల్సా కాస్త సముద్రంలో ఉన్నప్పుడు విలసగా గోదావరి పాయల్లోకి ప్రవేశించిన తరువాత పులసగా మారుతుంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సముద్ర జలాల నుంచి సుమారు 11వేల నాటికల్ మైళ్ల దూరం 30 నుంచి 40 రోజులు ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రయాణం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే పునరుత్పత్తి. పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ సముద్రం బంగాళాఖాతం మీదుగా గోదావరి పాయల్లోకి వస్తాయి. చేపలు ఏడాది పొడవునా గోదావరి లోకి రావు. ఎక్కువగా వరద వచ్చే ఆగస్టు-సెప్టెంబర్ తొలివారంలో మాత్రమే వస్తాయి. గోదావరి నదికి ఎర్రని రంగులో ఉండే వరద వచ్చే సమయానికి గుడ్లు పెట్టడానికి వలస వస్తుంటాయి.
Advertisement
ఆడ-మగ పులసలు గోదావరిలో ఇసుక గులక రాళ్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సంగమించి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు ఒకటి రెండు రోజుల్లో చేప పిల్లలుగా ఎదుగుతాయి. పులస చేప పిల్లలను జట్కా అని పిలుస్తుంటారు. పునరుత్పత్తి తరువాత వచ్చిన సముద్ర మార్గంలోనే పిల్లలతోనే కలిసి తిరిగి వచ్చిన చోటుకే వెళ్లిపోతాయి. ఈ తరుణంలో వీటిని కొన్ని గోదావరిలో మత్స్యకారులు వలలకు చిక్కి సిరులు కురిపిస్తాయి. గోదావరిలో ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఉభయ గోదావరి జిల్లాల్లోని గౌతమి-వృద్ధ గౌతమి – వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల్లో మాత్రమే లభిస్తాయి.
పులస చేపలకు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే.. గోదావరి వరదకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో ఎదురీదుతాయి. సాధారణంగా గోదావరికి వరదలు వచ్చే జులై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులస చేపలు లభిస్తాయి. గోదావరి జిల్లాల్లో సముద్రముఖ ద్వారం నుంచి గోదావరి నదిలో సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయట. ఇక్కడ వాటిలో కీలకమైన రసాయనిక చర్యలు జరిగి వాటి కండరాల్లో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. పులసలకు స్వేద గ్రంథులుండవు. మామూలుగా చేపల్లో ఒమెగా-3 పేట్రియాసిడ్స్ ఉంటాయి. ఈ ఆమ్లాలు పులసల్లో మూడు రెట్లు అధికంగా ఉంటాయని అందువల్లనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతారు. అందుకే పులసను క్వీన్ ఆఫ్ ది ఫిష్గా పిలుస్తారు.