Home » జాంబియాలో కలరా కల్లోలం.. పాఠశాలలు బంద్..!

జాంబియాలో కలరా కల్లోలం.. పాఠశాలలు బంద్..!

by Anji

దక్షిణ- మధ్య ఆఫ్రికా లో ఒక భూపరివేష్టిత దేశం జాంబియా. ఈ దేశం ఇప్పుడు కలరా వ్యాధితో పోరాడుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు జాంబియాలో 400 మందికి పైగా బాధితులు మరణించారు. 10వేల మందికి పైగా జనం ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పాఠశాలలను మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని లూసాకాలోని అతి పెద్ద పుట్ బాల్ స్టేడియంను కలరా చికిత్స కేంద్రంగా మార్చారు.

జాంబియన్ ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. దేశంలోని పలు కలరా పీడిత ప్రాంతాల్లో రోజుకు 2.4మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందజేస్తోంది. జాంబియా పబ్లిక్ హెల్త్ ఇన్ స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం.. జాంబియాలో కలరా వ్యాప్తి గత ఏడాది అక్టోబర్ లో ప్రారంభం అయింది. ఆ నెలలో కలరా కారణంగా 412 మంది మరణించారు. అదేవిధంగా 10,413 కలరా కేసులు నమోదు అయ్యాయి.

దేశంలోని 10 రాష్ట్రాల్లో తొమ్మిది రాష్ట్రాలు కలరా వ్యాధి బారిన పడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాదాపు రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400 కి పైగా కలరా కేసులు నమోదు అవుతున్నాయి. కలరా అనేది నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. అపరిశుభ్రత కారణంగా వ్యాపిస్తుంది. కలుషిత నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల కలరా సోకుతుంది. గత ఏడాది ఆఫ్రికాలోని మరో దేశమైన జింబాబ్వే కూడా కలరా వ్యాపించింది. ఇక్కడ కూడా స్వచ్ఛమైన తాగునీటి కొరత ఉంది. కలరా వ్యాపిస్తున్న మణికాలాండ్, మాస్వింగో రాష్ట్రాల్లో అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్య కేవలం 50 మందికే పరిమితం చేసారు.

 

Visitors Are Also Reading