జనసేనాని పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలను సమర్ధవంతంగా నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అందుకు తగ్గట్లే ప్రిపేర్ అవుతున్నట్లు ఉన్నారు. ప్రచారంలో భాగంగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ “వారాహి యాత్ర” ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రజల మధ్య ఉండి, ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఈ యాత్రను సంకల్పించారు.
గత రెండు విడతలుగా విజయవంతంగా కొనసాగిన ఈ యాత్ర ప్రస్తుతం మూడవ విడతకు చేరుకుంది. మూడవ విడత తొలిరోజున ప్రసంగించిన పవన్ కళ్యాణ్ గద్దర్ ను గుర్తు చేసుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ కు, పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తాను కష్టంలో ఉంటె ఆదుకునేవాడు అంటూ గద్దర్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. పవన్ ఏరోజు వీటి గురించి మాట్లాడలేదు. చివరకు గద్దర్ చనిపోయినపుడు ఆయన మృతదేహానికి నివాళులు అర్పించిన పవన్ కన్నీటి పర్యంతమయ్యారు.
వారాహి మూడవ విడత యాత్ర తొలిరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గద్దర్ పెట్టిన మెసేజ్ ను గుర్తు చేసుకున్నారు. గద్దర్ చనిపోవడానికి ఒక వారం రోజుల ముందు తనకు మెసేజ్ చేసారని.. ఏపీలో కనీసం అరవై శాతం మంది యువతకు మార్గదర్శనం చేసి విజయం సాధించాలని కోరుకున్నానని గద్దర్ పేర్కొన్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏపీలో అదే జరగబోతోందని.. ఎపి యువత కోసం పోరాడడానికి సిద్ధం అయ్యానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. జగన్ ఏపీ యువతని వంచించారని పవన్ అభిప్రాయం వ్యక్తం చేసారు. వైసీపీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు, యాభై వేల మంది టీచర్లకు భర్తీలు, జాబ్ కాలెండర్ ఇస్తాం అంటూ హామీ ఇచ్చారు. కానీ, ఇవన్నీ ఎక్కడ నెరవేర్చారో చెప్పాలని పవన్ డిమాండ్ చేసారు.