సకల ప్రాణకోటికి జీవనాధారం నీరే. భూమిపై ప్రకృతి సహజ సిద్ధంగా లభించే మంచి నీరు సకల కోటి జీవరాశులకు ప్రాణాధారం. అన్ని ప్రాణాలకు సమాన హక్కు ఉన్న ప్రకృతి వనరులను మనుషులు మాత్రం కలుషితం చేస్తున్నారు. కలుషితమైన నీరు కారణంగానే మనుషులు రోగాలు కొని తెచ్చుకుంటారు. మినరల్ వాటర్ లక్షల రూపాయలు వెచ్చించి కొంటున్న ఈ కాలంలో ఇంకా కొండల మధ్య నుంచి వచ్చే నీరు మాత్రమే తాగుతూ ఉన్నారు అక్కడి ప్రజలు. ప్రకృతిని నమ్ముకున్న వారికి ఆ ప్రకృతే అండగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కొండ గిరుల్లో ఉన్న ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే శుద్ధజలంతో త్రాగునీటి అవసరాలు తీరడంతో పాటు, రోగాలు దరి చేరకుండా ఉంటాయని వారు పేర్కొంటున్నారు. ఈ మంచినీటి ధార ఎక్కడుందని అనుకుంటున్నారా..? ఇది తెలియాలంటే మాత్రం ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామాలకు వెళ్లాల్సిందే.
అది ఎక్కడంటే.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఎలుబక గ్రామ శివారు ప్రాంతం. అందమైన అడవులకు ప్రకృతి రమణీయతకు నిలయం. ఇక్కడి అటవీ ప్రాంతంలోని పెద్దగుట్ట పై నుంచి నిరంతరం స్వచ్ఛమైన నీరు పారుతుంటుంది. ఏ కాలంలో అయినా ఈ నీరు పారుతూనే ఉంటుంది. బుగ్గతోగు గుట్టగా ప్రసిద్ధి చెందిన సన్నని జలధార వచ్చే నీటినే చుట్టు పక్కల గ్రామస్తులు వినియోగిస్తుంటారు. మినరల్ వాటర్ బాటిల్స్, ప్రయివేటు వాటర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు మాత్రం బుగ్గ తోగు గుట్ట నీటినే వాడుతుంటారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే మేడారం జాతర సమయంలో కూడా భక్తులకు ఈ నీటిని అమ్ముతుంటారని పలువురు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement
బుగ్గ తోగు గుట్ట జలధారపై అక్కడి గ్రామాల ప్రజలకు ఎంతో నమ్మకం. కేవలం త్రాగునీరుగా మాత్రమే వీరు ఈ నీటిని వినియోగించడం లేదు. సీజన్లో వచ్చే రోగాలు ధరి చేరకుండా ఉండాలంటే స్వచ్ఛమైన ఈ నీటిని తాగితే చాలు అని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మినరల్ వాటర్ తాగితే ఎముకల అరుగుదల, కెమికల్స్ ఎక్కువైతే అనారోగ్య పరిస్థితులు వస్తాయి. కానీ సహజసిద్ధమైన నీటితో ఎటువంటి ఇబ్బందులు లేవు అని.. గ్రామస్తులు పేర్కొంటున్నారు. 40 సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు ఈ నీటిని త్రాగడానికి ఉపయోగిస్తున్నారంటే.. ఈ నీరు ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లో తాగునీటికి అనేక రూపాలున్నాయి.
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు మౌంటెన్ స్ప్రింగ్ వాటర్ అని లక్షల రూపాయలు వెచ్చించి తాగునీరు కొనుగోలు చేస్తున్నారు.కానీ ఇక్కడి ప్రజలకు నయా పైసా ఖర్చు లేకుండా బుగ్గతోగు గుట్ట నుంచి వచ్చే నీరు సేవిస్తుంటారు. ఆ నీరు చాలా తియ్యగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయిన ఎలుబక గ్రామ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జలధార ఉన్నది. ఎత్తైన గుట్టలు, రాళ్ల గుట్టల మధ్యలో నుంచి నిరంతరం సన్నని జలధార పారుతుంటుంది. సన్నని ఈ జలధారను చూసి ఇక్కడికి వచ్చినవారందరూ ఆశ్చర్యపోతుంటారు. కొండల్లో నుంచి ఈ నీరు ఎలా వస్తుంది అని, ఎలా ఉద్భవిస్తుందని, ఎలా పారుతుందని.. స్వచ్ఛమైన నీరు ఎలా వస్తుందనే ప్రశ్నలు మదిలో మెదులుతూనే ఉంటాయి. స్థానికుల సాయంతో ప్రయివేటు ఆటోల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇటువంటి జలధార మరోకటి మేడారం జాతర చిలుకలగుట్ట సమీపంలో కూడా ఉంటుంది.
Also Read :
సమాధులపై బార్కోడ్.. ఎక్కడంటే..?
“అయోధ్య రామయ్య” గా మొదలైన బాలయ్య సినిమా”నరసింహనాయుడు” గా ఎలా మారిందో తెలుసా..!