ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నచ్చిన వంటకాలు సెకన్ల కాలంలో దర్శనం ఇస్తుంటాయి. నిమిషాల్లో ఇంటికి చేరుతాయి. ఈ సౌలభ్యంతోనే రవాణా ఆధారిత యాప్లపై కస్టమర్లు అధికంగా ఆధారపడుతున్నారు. స్వీట్ నుంచి బిర్యానీ వరకు సర్వం ఆన్లైన్ సేవలతోనే పొందుతున్నారు. ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే ఫోన్ తీసి యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టేస్తున్నారు. తాజాగా డిసెంబర్ 31న ఒక్కరోజే ఆర్డర్ల వెల్లువ కొనసాగింది. సుమారు 100 కోట్ల విలువైన ఆహారపదార్థాలను యూజర్లు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచారు. నిమిషానికి 17వేల ఆర్డర్లు రాగా.. అందులో బిర్యానియే టాప్లో నిలిచి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. స్విగ్గీ, జొమాటో యాప్లుఒక్క రోజే తలో 20లక్షల ఆర్డర్లు పొందాయి. ఈ విషయాన్ని సంబంధిత సీఈఓలు ట్విట్టర్ వేధికగా వెల్లడించి అందరినీ అవాక్కయ్యేలా చేసారు.
నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, నిత్యావసర దుకాణాలు డిసెంబర్ 31న ఆన్లైన్ గిరాకితో కళకళలాడుతున్నాయి. ఒక్క డెలివరీ బాయ్ రోజుకు సుమారు 40 ఆర్డర్లు చేస్తే.. 31రోజు మాత్రం 85కు పైగా ఆర్డర్లు డెలివరీ చేసినట్టు డెలివరీ బాయ్ రమేష్ తెలిపారు. సంస్థలు 31 డిసెంబర్, జనవరి 01 ఈవ్ పేరుతో డెలివరీ బాయ్స్కు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వరుసగా 5 గంటలకు యాప్ సర్వీస్ సేవలు అందించడం, 50కి పైగా ఆర్డర్స్ చేయడం తదితర సంస్థ నిబంధనలు ఫాలో అయిన వారికి ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఈ కారణంతో ఆలా మంది డెలివరీ బాయ్స్ 2021 చివరి రోజున వందల్లో డెలివరీ చేసి అధికంగా ఇన్సెంటివ్ పొందడం విశేషం.
స్విగ్గీకి నిమిషానికి 9వేల ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ 31న 5,500 ఆర్డర్లు రాగా.. ఈసారి 9050ఆర్డర్లు యూజర్ల నుంచి పొందింది. నిమిషానికి 1300 బిర్యానిలను డెలివరీ చేసింది. నిమిషానికి 8వేల ఆర్డర్లను పొందింది. రోజులో మొత్తం 20లక్షల వరకు ఆర్డర్లను రీసీవ్ చేసుకుందని సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. డెలివరీలు యాప్లు 5 శాతం జీఎస్టీని రెస్టారెంట్ల నుంచి వసూలు చేసేవి. ఇక నుంచి కస్టమర్ల నుంచి ఇది అమలు అవ్వనుంది.